భారతీయ హిందూ ధర్మంలో ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి ఇంటిలో ఉంటే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా మారతారు. కానీ, లక్ష్మీదేవి కేవలం ధనాన్ని ఇచ్చే దేవత మాత్రమే కాదు, ఆమె మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించే దేవత కూడా.
గురువారాన్ని లక్ష్మీవారం అని, శుక్రవారాన్ని ఆమెకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో ప్రతిరోజూ పూజ చేస్తే, ఆమె సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుందని నమ్మకం. ఇప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు ఏమిటో తెలుసుకుందాం.
తామర పువ్వు
తామర పువ్వు లక్ష్మీదేవికి ప్రియమైనది. ఆమె తామర పువ్వులో ఆసీనురాలై ఉండడం మనం చూస్తాం. బురదలో వికసించే తామర పవిత్రతకు చిహ్నం. పూజలో తామర పువ్వు సమర్పించడం ద్వారా ధనసంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మల్లె పువ్వులు
మల్లె పువ్వులు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవిగా పరిగణించబడతాయి. ఈ తెలుపు పువ్వులు స్వచ్ఛతను, శాంతిని సూచిస్తాయి. మల్లె పువ్వులను సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. అలాగే, పనుల్లో విజయం సాధిస్తారు.
గులాబీ పువ్వులు
గులాబీ పువ్వులు, ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీలు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఇవి శక్తి, ప్రేమకు సంకేతాలు. డబ్బులు వెనక్కి రాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు గులాబీ పువ్వులతో పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, వైవాహిక సమస్యలు పరిష్కరించబడతాయి.
బంతి పువ్వు
భారతీయ పూజలలో బంతిపువ్వుకు ప్రాముఖ్యత ఉంది. పూజా కార్యక్రమాల్లో బంతిపువ్వుల ఉనికి ప్రత్యేకం. దుష్టశక్తులు తొలగిపోవాలని, ఇంట్లో సానుకూల శక్తి నిలవాలని కోరుకునేవారు బంతిపువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి.
మొగలి పువ్వు
మొగలిపువ్వు దాని వాసనతో ప్రసిద్ధి. ఈ పువ్వు లక్ష్మీదేవికి ఇష్టమైనది. మొగలిపువ్వును సమర్పించడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది.
మందారం పువ్వు
ఎరుపు రంగు మందారం శక్తికి, అదృష్టానికి చిహ్నం. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. మందారం పువ్వుతో పూజ చేస్తే ఆర్థిక సమృద్ధి, శ్రేయస్సు పొందుతారు. నిలిచిపోయిన పనులు తిరిగి పూర్తి అవుతాయి, వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది.
పూజలో పువ్వులను సమర్పించే నియమాలు
పూజలో తాజా పువ్వులను, సువాసన గల పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. పువ్వులను సమర్పించే ముందు గంగాజలంతో శుద్ధి చేయాలి. ఏ పువ్వు సమర్పించినా, ఆ దేవత నామస్మరణతో సమర్పించాలి. ఈ నియమాలను పాటిస్తే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం సులభమవుతుంది.